హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు సిటీ పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్.మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియాతో మాట్లాడిన ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు భద్రత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యమని.. రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు సజ్జనార్.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు అని.. మద్యం మత్తులో డ్రైవింగ్ను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు సజ్జనార్. డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
►ALSO READ | 2026 కోసం యాక్సిస్ సెక్యూరిటీస్ 9 స్టాక్స్ పిక్.. టార్గెట్ ధరలు ఇవే..
మోటార్ వాహనాల చట్టం–1988, సెక్షన్ 185 ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. పది వేలు జరిమానా, గరిష్టంగా 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని.. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే.. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ ఉంటుందని, తీవ్రమైన కేసుల్లో లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని అన్నారు సజ్జనార్.
మైనర్లు వాహనాలు నడపడం నిషేధమని.. మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సజ్జనార్.
