కూరగాయల మార్కెట్ గా మారిన ధర్నాచౌక్

కూరగాయల మార్కెట్ గా మారిన ధర్నాచౌక్

హైదరాబాద్: దశాభ్దాలుగా…ఉద్యమాలకు వేదిక.  సమస్య ఏదైనా…అక్కడ ధర్నా చేస్తే  న్యాయం దొరుకుతుందనే భరోసా. ప్రస్తుతం ఎలాంటి ప్రొటెస్ట్ లు లేకపోవడంతో…ధర్నాచౌక్ ప్రాంతం ఇప్పుడు పండ్లు, కూరగాయల మార్కెట్ కు అడ్డాగా మారింది. నిరసనకారులను ఇందిరాపార్క్ ప్రాంతానికి రానియ్యకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానికులు.

గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదికగా ఉన్న ఇందిరా పార్క్  ధర్నా చౌక్ ఇప్పుడు కూరగాయల మార్కెట్ గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఇక్కడ ధర్నాలు జరిగేవి. టీఆర్ఎస్ కూడా ఇదే ధర్నా చౌక్ ను ఆయుధంగా వాడుకుంది. అధికారంలోకి రాగానే ధర్నాచౌక్ ను సరూర్ నగర్ కు తరలించింది. ఇక్కడ ఎవరూ నిరసనలు తెలపకుండా పోలీసులను కాపలా పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ధర్నాచౌక్ కూరగాయల మార్కెట్ గా మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు తమను  లోపలికే రానిచ్చేవారుకాదంటున్నారు కూరగాయల వ్యాపారులు.

గతంలో పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు ఇక్కడ ధర్నా చేసేశారు. అసెంభ్లీ నడుస్తున్నటైంలో ఇక్కడ టెంట్లు వేసి, ఆందోళనకు చేస్తూ డిమాండ్లు సాదించుకొనేవారు. కొన్ని సందర్భాల్లో మంత్రులు వచ్చి దీక్షలను విరమింపజేసేవారు. నాడు ఏర్పడుచేసిన బారికేడ్స్,ముళ్లకంచెలు తుప్పుపట్టిపోయాయి. వాటి స్థానంలో పండ్లు, కూరగాయల బండ్లు కనిపిస్తున్నాయి. ప్రజా ఉద్యమాల అణిచివేతలో భాగంగానే ప్రభుత్వం ధర్నాచౌక్ ను తరలించిందంటున్నారు మేధావులు. ప్రశ్నిస్తే పాలకులు తట్టుకోలేక పోతున్నారంటున్నారు. ఒకప్పుడు ధర్నాలు, ఆందోళనతో నిత్యం రద్దీగా ఉండే ధర్నాచౌక్ కు  ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందంటున్నారు జనం.