
హైదరాబాద్: నగరవాసులకు కరోనా కష్టకాలంలోనూ మంచి నీటి కొరత ఉండదని తెలిపారు వాబాగ్( WABAG) అధికారులు. కోవిడ్-19 ఆరోగ్య సంక్షోభ సమయంలో హైదరాబాద్ వాసులకు సురక్షితమైన తాగునీటిని తయారు చేస్తున్నామంటూ వాబాగ్ భరోసానందిస్తుంది. నగరంలోని నీటి శుద్ధి కర్మాగారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా లాక్ డౌన్ దశలో ప్రజల ఆరోగ్య, పరిశుభ్రతా అవసరాలను తీర్చగలిగిందని తెలిపింది వాబాగ్.
ప్రస్తుతం కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్ ను కొండాపూర్ వద్ద 1230ఎంఎల్డీ సామర్థ్యంతో.. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టును మల్లారం వద్ద 735 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని కోటి మంది జనాభా తాగునీటి అవసరాలను ఇవి తీర్చనున్నాయి. ఈ ప్లాంట్ లే నగరంలోని సుప్రసిద్ధ పారిశ్రామిక ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేస్తున్నాయని..వాబాగ్ కోవిడ్ వారియర్స్, మెరుగైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ.. భౌతిక దూరం అనుసరిస్తూ 24 గంటలూ పనిచేస్తున్నారని చెప్పింది.
కరోనో కష్ట సమయంలోనూ పని చేసిన ఓ అండ్ ఎం బృంద ప్రయత్నాలను ప్రశంసించారు గ్లోబల్ హెడ్ బిజినెస్ డెవలప్ మెంట్ ప్రతినిధి రజ్నీష్ చోప్రా. ఈ సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ నగరవాసులకు సురక్షితమైన తాగునీటిని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.