
హైదరాబాద్, వెలుగు: ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సామ్యూల్ను సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, బై బ్యాక్ స్కీమ్స్, ప్రీ లాంచ్ పేర్లతో 150 మంది నుంచి సామ్యూల్ రూ. 25 కోట్లు వసూల్ చేసి వారందరిని మోసం చేసినట్లు క్రైం డీసీపీ ముత్యం రెడ్డి వెల్లడించారు. సామ్యూల్, గోగుల లక్ష్మీ విజయ కుమార్ కలిసి ఏవీ ఇన్ఫ్రాకాన్, ఏవీ ఆర్గానో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడి, బై-బ్యాక్, ప్రీ-లాంచ్ స్కీమ్ల ద్వారా అధిక రాబడి హామీలతో పెట్టుబడిదారులను ఆకర్షించారు.
కొంతకాలంగా ఫేక్ ఒప్పందాలు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఎంఓయూ, సేల్ డీడ్లను అందజేసి పెట్టుబడులు చట్టబద్ధమని నమ్మించారు. అయితే, వారు హామీ ఇచ్చిన ఓపెన్ ప్లాట్లను రిజిస్టర్ చేయకపోగా, పెట్టుబడి చేసిన డబ్బును కూడా తిరిగి చెల్లించలేదు. దాంతో మోసపోయామని గుర్తించిన పలువురు బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు..గోగుల లక్ష్మీ విజయ కుమార్ను నెల కిందటే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా, తాజాగా సామ్యూల్ను బంజారాహిల్స్ లో అరెస్ట్ చేశారు.