వరద ముప్పు లేని హైదరాబాదే లక్ష్యం : హైడ్రా కమిషనర్ రంగనాథ్

వరద ముప్పు లేని హైదరాబాదే లక్ష్యం : హైడ్రా కమిషనర్ రంగనాథ్
  • వాల్యూయర్స్ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల సాకారం కావాలంటే, బ్యాంకర్ల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. శనివారం ఐఓవీ (ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్) హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్’ అనే అంశంపై శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రంగనాథ్ హాజరై మాట్లాడారు. రుణాల మంజూరీలో మోసాలు జరగకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వాల్యుయేషన్​లో పారదర్శకత, కచ్చితత్వం కీలకమన్నారు. పర్యావరణహిత నగరాభివృద్ధికి హైడ్రా కట్టుబడి ఉందని, వరద ముప్పు లేని హైదరాబాద్ ను తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 

ప్యాట్నీ నాలా పరిశీలన

ప్యాట్నీ నాలా పునరుద్ధరణ పనులను కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్​తో రంగనాథ్ శనివారం పరిశీలించారు. 20 మీటర్ల వెడల్పు, ఇరువైపులా 5 మీటర్ల బఫర్​తో నాలా నిర్మాణం జరుగుతుండా, పూడిక తీత, రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో వరద ముప్పు నివారణకు నాలా పూడిక తీత పనులను కమిషనర్ పరిశీలించారు.