- ఆఫ్షోర్ క్యాంపస్ను ప్రారంభించనున్న యూకే వర్సిటీ
- బేగంపేట్ లేక్ వ్యూ గెస్ట్హౌస్లో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు
- భారత్ ఫ్యూచర్ సిటీ ఎడ్యుకేషన్ జోన్లో
- శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్షోర్ క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నేషనల్ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ను ఎంచుకున్న తొలి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా ఈ యూనివర్సిటీ నిలవనుంది. భారత ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్లో ఈ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, యూనివర్సిటీలు తమ విద్యా కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకుంటోంది. యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్గా హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
2027 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది. యూకేలోని కింగ్స్ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. తాజాగా ఆ విశ్వ విద్యాలయమే తెలంగాణలో తన క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలిస్తూ వచ్చారు. రాబోయే రెండేండ్ల కాలంలో, ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థల ఆఫ్-షోర్ క్యాంపస్లతో కూడిన ఒక నాలెడ్జ్ హబ్ను భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పరిశోధనా సంస్థలు, సాఫ్ట్ వేర్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాలు హైదరాబాద్ లో ప్రతిష్టాంగా ఉండటం వల్ల ప్రధానంగా మరిన్ని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో క్యాంపస్ ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.
త్వరలో మరిన్ని వర్సిటీలతో ఒప్పందాలు
త్వరలో మరిన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు విశ్వవిద్యాలయాలు ఫ్యూచర్ సిటీలో శాశ్వత క్యాంపస్ల నిర్మాణం ప్రారంభించనున్నాయి. కాగా, హైదరాబాద్లో తమ బ్రాంచ్ క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి ఇటీవల ముందుకు వచ్చిన యూకేకి చెందిన 13 పాఠశాలలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యూకే ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జాతీయ విద్యా విధానం -2020లోని నిబంధనల ద్వారా, తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే అంతర్జాతీయ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే.

