గొడవపడుతూ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు ..పేరెంట్స్కు హైకోర్టు సూచన

గొడవపడుతూ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు ..పేరెంట్స్కు హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు: విడివిడిగా ఉండే పేరెంట్స్‌‌‌‌ పిల్లల సంరక్షణ విషయంలో కలిసి ఉండాలని, విడివిడిగా ఉన్నా పిల్లల సంక్షేమం గురించి ఆలోచించాలని హైకోర్టు సూచించింది. కుటుంబ వివాదం కారణంగా కోపతాపాలు, పట్టింపులకుపోతే వాటి దుష్ప్రభావం పిల్లలపై పడుతుందని హెచ్చరించింది. వేరుగా ఉండే పేరెంట్స్‌‌‌‌ వాళ్ల అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం సబబు కాదని హితవు పలికింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌లో మైనర్‌‌‌‌ బాలికను నెల రోజుల పాటు తండ్రి కస్టడీకి ఇవ్వాలని తల్లిని ఆదేశించింది. 

మైనర్‌‌‌‌ బాలికను కొన్ని రోజులు తండ్రి కస్టడీకి ఇవ్వాలని గతేడాది నవంబర్‌‌‌‌ 18న హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా తన భార్య అమలు చేయడం లేదంటూ భర్త దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌‌‌‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి విచారించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన తల్లిదండ్రుల కారణంగా పాఠశాలకు వెళ్తున్న ఆరేండ్ల బాలిక ఇబ్బంది పడకూడదని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు.