హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్..

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్..

హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డు సృష్టించింది. నగరంలో కూల్ అండ్ సేఫ్ జర్నీని అందిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు 40 కోట్ల ప్రయాణికుల మార్క్ ను చేరుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

4లక్షల 90 వేల మంది జర్నీ

అప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో రైలులో 40 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ అంతరాయం నుంచి బయటపడేందుకు జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రోలో రోజుకు సగటున 4లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5లక్షలు దాటనున్నట్టు పేర్కొంటున్నారు.

ప్రయాణం సులభతరం

 విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఈ భాగ్యనగరంలో జీవనం సాగిస్తుంటారు. కాగా పెరుగుతున్న జనాభాతో రోడ్లపై ప్రయాణాలు చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దానితో ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చెయ్యడం కోసం మెట్రో రైలు ప్రయాణాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మెట్రో ప్రయాణంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందిని తొలగిస్తూ ప్రజలకు ప్రయాణాన్ని మరింత చేరువచేస్తోంది.