హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు దీరుతున్నాయి. ఈ సారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్నచిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ ఇందులో ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, గృహోపకరణాలు, ఆభరణాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులు అందుబాటులో ఉంటాయి.
నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పారిశ్రామిక ప్రదర్శనగానే కాకుండా దేశం నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతుల స్టాల్స్ తో ఆయా రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళన వేదికగా నిలుస్తుంది.
ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, వీకెండ్, హాలిడేస్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు రూ.50 కాగా, ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది ప్రభుత్వం. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయనున్నారు. నూమాయిష్ ప్రాంగణంలో మొత్తం 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. అగ్ని ప్రమాదాల నివారణకు లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ సంపులు, 82 హైడ్రాంట్లు ఏర్పాటు చేశారు. . రెండు ఫైరింజిన్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నాయి.
