
కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు తగిన బుద్ది చెప్పారు రెవెన్యూ అధికారులు. కుమారులు ఉన్న ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మలక్ పేట మూసారాంబాగ్ లో జరిగింది.
మూసారాంబాగ్కు చెందిన శకుంతలాబాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలా రోజుల క్రితం భర్త చనిపోయాడు. ఆలనాపాలనా చూసుకోవాల్సిన వయసులో కనికరం లేకుండా శకుంతలాబాయిని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేశారు కుమారులు. దీంతో దిక్కుదోచని స్థితిలో సైదాబాద్ లో ఉన్న చిన్న కూతురు దగ్గరికి వెళ్లి ఉంటోంది శకుంతలాబాయి. తన బాగోగులు చూడని కుమారులకు ఇల్లు ఇవ్వనని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను 2024 ఫిబ్రవరిలో ఆశ్రయించింది. ఆర్డీవో పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో, ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు ఇద్దరు కుమారులు.
ALSO READ | అపార్ట్మెంట్ కూల్చేస్తామంటూ.. గచ్చిబౌలిలో హైడ్రా పేరుతో బెదిరింపులు
కానీ నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకపోవడంతో సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ బాధితురాలి కుమారులకు ఫైనల్ నోటీసు జారీ చేసింది. గడువు ముగియడంతో జూన్ 26న సిబ్బందితో తహసీల్దార్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే కుమారులు ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో ఇంట్లోని కుమారు గదులను సీజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది ఇంటిని తల్లి శకుంతలాబాయికి అప్పగించారు.
ఈ మధ్య తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల చిత్రహింసలు పెడుతున్న ఘటనలు కూడా మనం చూశాం. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులను చూడని వారికి ఇదొక హెచ్చరికగా చెప్పవచ్చు..