స్కూళ్ల వద్ద ట్రాఫిక్పై డ్రోన్లతో నిఘా..బడి బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా యాక్షన్ ప్లాన్

స్కూళ్ల వద్ద ట్రాఫిక్పై డ్రోన్లతో నిఘా..బడి బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా యాక్షన్ ప్లాన్
  • స్కూల్​పరిసరాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నియంత్రణకు మార్షల్స్ ను ఏర్పాటు చేసుకోవాలి  
  • సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్​జాయింట్​సీపీ జోయల్​ డేవిస్​
  • స్కూల్​మేనేజ్​మెంట్స్, డ్రైవర్లు,  అధికారులతో కీలక సమావేశం

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  స్కూళ్ల వద్ద ట్రాఫిక్​పై డ్రోన్లతో నిఘా పెడతామని, స్కూల్​బస్సులు ట్రాఫిక్​ సమస్యల్లో చిక్కుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సిటీ సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్​జాయింట్​సీపీ జోయల్​డేవిస్​తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం  రవీంద్ర భారతిలో స్కూల్​యాజమాన్యాలు, డ్రైవర్లతో కలిసి విద్యార్థుల భద్రతపై  కీలక సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేటప్పుడు , తిరిగి వచ్చేటప్పుడు వారి భద్రతను మెరుగుపరచడంపై చర్చించారు. స్కూల్స్​చుట్టూ ట్రాఫిక్ నిర్వహణ, సురక్షిత రవాణా పద్ధతులు, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. 

ప్రైమరీ, హైస్కూల్ ​టైమింగ్స్​ మార్చాలి  

జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ 90 లక్షల పైగా వాహనాలు హైదరాబాద్​లో తిరుగుతున్నాయని, 3 వేల మంది సిబ్బందితో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను నియంత్రిస్తున్నామన్నారు. త్వరలో స్కూల్స్​వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, స్కూల్​పరిసరాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను చూసుకోవడం యాజమాన్యాల బాధ్యత అని, దాని కోసం ట్రాఫిక్ మార్షల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో ఎక్కించుకోకూడదని, దీనిని పోలీసుల బాధ్యతగా వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ప్రైమరీ స్కూల్, హై స్కూళ్ల సమయాల్లో మార్పులు చేయడం ద్వారా ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌లను కట్టడి చేయవచ్చని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, వారికి 25 ఏండ్ల వరకు వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదని హెచ్చరించారు. ఇప్పటివరకు 766 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 

రెండేండ్లలో 8 మంది చనిపోయారు 

సీవీ ఆనంద్​ మాట్లాడుతూ స్కూల్స్​ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల భద్రతపై ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా జాయింట్ సీపీ, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. స్కూల్స్​ప్రారంభమైనప్పుడు భద్రతా సమస్యలు వస్తాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల  2023  నుంచి 2025 వరకు 8 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

స్టూడెంట్స్​బస్సుల్లోనే వెళ్లేలా చూసుకోవాలన్నారు. స్కూల్​ప్రాంగణానికి 200 మీటర్ల పరిధిలో భద్రతా లోపాలకు హెచ్ఎం, యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి స్కూల్​పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రైవర్లు పిల్లలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పరిసర ప్రాంతాలను గమనించాలని, అక్కడే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నారు.

అనుమానాస్పద షాపులు, పాన్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదేండ్ల క్రితం అమలులో ఉన్న ట్రాఫిక్ కమాండో సిస్టమ్​ను తిరిగి ప్రవేశపెడతామన్నారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత కోసం ప్రతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ పార్కులు, రోడ్ సేఫ్టీ క్లబ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బల్దియా  అడిషనల్​కమిషనర్​ గోపాల్, జాయింట్​ట్రాన్స్​పోర్ట్​కమిషనర్ రమేశ్, ఆర్టీసీ ఈడీ మునిశేఖర్, డీఈఓ రోహిణి పాల్గొన్నారు.