సంక్రాంతి పండుగ రోజు(జనవరి 15) గాలిపటం ఎగరేస్తూ.. ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మధురానగర్ పరిధి రహమత్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్నగర్లో చౌహాన్ శ్రీదేవ్(21) సోమవారం రాత్రి ఓ భవనం మూడో అంతస్తులో గాలిపటం ఎగరేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి కిందపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగురేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చౌహాన్ శ్రీదేవ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చౌహాన్ మిత్రులు ఆరుగురిపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.