
హైదరాబాద్ లో సోమవారం రాత్రి భారీ వర్షం.. బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ఎల్బీస్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ట్రీట్ మెంట్ కోసం హస్పిటల్ కి తరలించారు. మృతుడిని జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.
డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరిన సుబ్రహ్మణ్యం.. మెట్రో రైల్ ఎక్కడానికి ఎల్బీ స్టేడియం నుంచి స్టేషన్ కి వెళ్తుండగా.. ఫెడ్ లైట్ మీద పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరో వ్యక్తి GST ఉద్యోగి రమేష్ కి రెండు కాళ్ళు విరిగి పోయాయి. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి.
కూకట్పల్లి, గాంధీనగర్, వెంగళరావు పార్కు సమీపంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. అలాగే, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో కార్లు ధ్వసంమయ్యాయి. లక్డికాపూల్, మాసాబ్ ట్యాంక్ వద్ద హోర్డింగ్లు కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్ష సూచన ఉండటంతో GHMC అప్రమత్తమైంది. ఎన్ ఫోర్స్ మెంట్, NDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. కూలిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అత్యవసర బృందాలు, ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్ఆర్డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.