
- సిటీలో రికార్డ్ లెవెల్లో ఇండ్ల అమ్మకాలు..2023లో అమ్ముడైనవి 32,880 యూనిట్లు
- చదరపు అడుగు సగటు ధర 11 శాతం పైకి
- వెస్ట్, సౌత్ ఏరియాల్లో రెంట్లు జూమ్ : నైట్ ఫ్రాంక్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కిందటేడాది దూసుకుపోయింది. పెద్ద మొత్తంలో ఇండ్ల అమ్మకాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ తాజా రిపోర్ట్ ప్రకారం, సిటీలో రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలు కిందటేడాది 6 శాతం వృద్ధి చెంది 32,880 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైమ్ హై! బయ్యర్ల ఆలోచనా విధానం మారిందని, పెద్ద ఇండ్ల వైపు మొగ్గు చూపుతున్నారని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కొత్తగా లాంచ్ అయిన ఇండ్లు పెరిగాయి. 2023 లో కొత్త లాంచ్లు 7 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) ఎగసి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇందులో 43 శాతం హై ఎండ్ ఇండ్లని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. వీటి ధరలు రూ. కోటి పైన ఉన్నాయని తెలిపింది. ప్రజలు లగ్జరీ ఇండ్ల వైపు చూస్తున్నారని, అందుకే డెవలపర్లు లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్లలో వీటి వాటా ఎక్కువగా ఉందని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. డిమాండ్ బాగుండడంతో కిందటేడాది చదరపు అడుగు సగటు ధర 11 శాతం ఎగసి రూ.5,550 కి పెరిగిందని వివరించింది. హైదరాబాద్లో రెంట్లు పెరిగాయని, ముఖ్యంగా సిటీలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఇండ్ల అద్దెలు ఎక్కువగా పెరిగాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ ఏరియాల్లో ఇండ్లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోందని అంచనా వేసింది. అంతేకాకుండా సిటీ శివార్లలో కూడా ప్రాపర్టీ రేట్లు పెరిగాయని వెల్లడించింది. కోకాపేట్లో ధరలు చదరపు అడుగుకు రూ.12,500 కి చేరుకున్నాయని, 2022 లో రికార్డయిన రూ.10,045 తో పోలిస్తే 39 శాతం పెరిగాయని వెల్లడించింది. ఆ తర్వాత మణికొండలో 28 శాతం, రాజేంద్ర నగర్లో 20 శాతం ఎగశాయని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, రూ.50 లక్షల లోపు ఉన్న ఇండ్లకు డిమాండ్ తగ్గింది. 2018 లో అమ్ముడైన ఇండ్లలో వీటి వాటా 26 శాతం ఉంటే 2023 లో ఇది 11 శాతానికి పడిపోయింది. అదే విధంగా రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్న ఇండ్ల డిమాండ్ 52 శాతం నుంచి 40 శాతానికి తగ్గిందని నైట్ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది.
ఆఫీస్ స్పేస్కు ఫుల్ గిరాకీ
దేశంలోని టాప్ సిటీలలో ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ పెరిగింది. కీలక మార్కెట్ అయిన బెంగళూరులో తగ్గినా ఓవరాల్గా ఇండియా మొత్తం మీద 15 శాతం వృద్ధి కనిపించిందని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం, 2023 లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 5.96 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. ఎంఎన్సీ కంపెనీలు ఇండియాలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయని, ఇవే 2023లో 2.08 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయని వివరించింది. అంతకు ముందు ఏడాదిలో రికార్డ్ అయిన డిమాండ్తో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ.
హయ్యెస్ట్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ను 2019 లో (6.06 కోట్ల చదరపు అడుగులు ) చూశాం. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 లో 88 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 32 శాతం ఎక్కువ. ముంబైలో 16 శాతం పెరిగి 74 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ –ఎన్సీఆర్లో 14 శాతం పెరిగి 1.01 కోట్ల చదరపు అడుగులకు, పూణెలో 9 శాతం పెరిగి 67 లక్షల చదరపు అడుగులకు, చెన్నైలో ఏకంగా 92 శాతం పెరిగి 1.08 కోట్ల చదరపు అడుగులకు ఎగసింది.