
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతను కొత్త ఏజెన్సీకి అప్పగించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రత్యేక స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణపై చర్చించారు. ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్) సంస్థతో ఒప్పందం గడువు ముగియడంతో ఎలక్ట్రికల్ విభాగం అధికారులు స్టాండింగ్ కమిటీ ముందు రెండు ఆప్షన్లు పెట్టారు. తిరిగి ఈఈఎస్ఎల్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం లేదా కొత్త ఏజెన్సీని ఎంచుకోవడానికి టెండర్లు ఆహ్వానించాలని తెలిపారు.
కొత్త ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త ఏజెన్సీని ఎన్నుకునేందుకు టెండర్లు వేయనున్నారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ చౌహాన్, రవికిరణ్, అడిషనల్ కమిషనర్ వెంకన్న, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, మహాలక్ష్మి పాల్గొన్నారు.