ఉక్రెయిన్పై రష్యా దాడులు రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులతో అక్కడున్న తెలుగువారు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తమను ఎలాగైనా తీసుకెళ్లాలంటూ భారత ఎంబసీని వేడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డకు చెందిన కందుకూరి వైష్ణవి విన్నిట్సియా నగరంలోని నేషనల్ పిరిగోవ్ మెడికల్ యునివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించగానే బంకర్లోకి వెళ్లాలంటూ వైష్ణవికి యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఆమె తన స్నేహితులతో కలిసి తమ నివాస స్థలానికి దగ్గర్లో ఉన్న బంకర్లోకి వెళ్లారు. అక్కడి నుంచి వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపించారు. ప్రస్తుతం తామందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. యూనివర్సిటీ అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నామని.. ఎవరూ భయపడొద్దని పేరెంట్స్కు తెలిపారు.
కాగా.. వైష్ణవిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని ఆమె తల్లి సవిత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తన కూతురుతో పాటు ఉన్న మరో పది మంది విద్యార్థులను క్షేమంగా తిరిగి తీసుకురావాలని ఐటీ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
For More News..