
హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుంచి చికాగోకు డైరెక్ట్గా విమానం సర్వీసులను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసువచ్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానంలో నాన్స్టాప్ చికాగోకు వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ విమానం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ఈ బోయింగ్777-200 ఎల్ఆర్ విమానంలో మొత్తం 238 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వీటిలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకనామీ క్లాస్ సీట్లు ఉండగా.. 4 కాక్పిట్, 12 క్యాబిన్ క్రూ సీట్లు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ టూ చికాగో సర్వీసులో భాగంగా.. బుధవారం మొదటి విమానం చికాగో నుంచి రాత్రి 9.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఏఐ-108 విమానం హైదరాబాద్కు బయలుదేరింది. ఆ విమానం నేడు శుక్రవారం తెల్లవారుజామున 1.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. డైరెక్ట్గా వచ్చిన ఈ మొదటి సర్వీసులో ప్రయాణించిన ప్రయాణీకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విమానాన్ని నడిపిన పైలట్లను శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రతినిధులు ప్రశంసించారు.
అదేవిధంగా హైదరాబాద్ నుంచి చికాగోకు మొదటి ఫ్లైట్ ఏఐ-107 శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు చికాగోకు బయలుదేరింది. ఈ ఫ్లైట్ సర్వీసులు వారానికి ఒకసారి మాత్రమే ఉంటాయి. హైదరాబాద్ నుంచి చికాగోకు ప్రతి శుక్రవారం, చికాగో నుంచి హైదరాబాద్కు ప్రతి బుధవారం ఈ సర్వీసులు ఉంటాయని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. చికాగో నుంచి హైదరాబాద్కు రావడానికి మొత్తం జర్నీ సమయం 15 గంటల 40 నిమిషాలు పట్టింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చికాగోకు చేరుకునేందుకు 16 గంటల 45 నిమిషాలు పట్టనుంది.\
For More News..