పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ సభ నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వీవీఐపీ కాన్వాయ్ల రాకపోకలు, సభకు వచ్చే లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో దారి మళ్లింపులు చేపట్టనున్నారు. ముఖ్యంగా బేగంపేట్, ప్యారడైజ్, పట్నీ, క్లాక్టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్పల్లి, తిరుమలగిరి మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
- బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లేవారు ప్యారడైజ్, పట్నీ మీదుగా క్లాక్టవర్ మార్గాన్ని ఎంచుకోవాలి.
- బేగంపేట్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనదారులు సెయింట్ జాన్స్ రోటరీ, ఏఓసీ మార్గం ద్వారా వెళ్లాలి.
- బాలానగర్ నుంచి వచ్చేవారు అమీర్పేట్, పంజాగుట్ట మీదుగా లేదా రసూల్పురా, మినిస్టర్ రోడ్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
- ట్యాంక్బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే ప్రయాణికులు సీటీవో, తాడ్బండ్, డైమండ్ పాయింట్ మార్గాలను వినియోగించుకోవాలి.
- మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిషేధం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు మెట్రో రైలును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తే టోయింగ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర సేవల వాహనాలను పరిస్థితిని బట్టి అనుమతి ఉంటుందని, వాహనదారుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 8712662999 సంప్రదించాలని సూచించారు. సభకు వచ్చే వారి కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు.
