సన్ రైజర్స్ ఏం చేస్తుందో?
దుబాయ్: ఢిల్లీ, చెన్నైపై వరుస విజయాల తర్వాత ముంబై ఇండియన్స్ చేతిలో కంగుతిన్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం ఇక్కడ జరిగే లీగ్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడనుంది. బ్యాటింగ్ విషయంలో ఇరుజట్లు పవర్ హిట్టర్లతో బలంగా కనిపిస్తున్నా.. బౌలింగ్ లైనప్లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్టార్ పేసర్ భువనేశ్వర్ సేవలు కోల్పోవడంతో యంగ్స్టర్స్తో నిండిన సన్రైజర్స్ బౌలింగ్ లైనప్పై కాస్త ఒత్తిడి ఉంది. బ్యాటింగ్ విషయంలో సన్రైజర్స్కు పెద్దగా సమస్యల్లేవు. బెయిర్ స్టో, మనీశ్ పాండే, డేవిడ్ వార్నర్, విలియమ్సన్తో కూడిన సన్రైజర్స్ టాపార్డర్కు కళ్లెం వేయడం పంజాబ్ బౌలర్లకు సవాలే. వీరికి తోడు అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్తో మిడిలార్డర్ బలంగా తయారైంది. పేసర్లలో నటరాజన్ నిలకడగా బౌలింగ్ చేస్తుండగా సందీప్ శర్మ, సిద్ధార్ధ్ కౌల్ భారీగా రన్స్ ఇచ్చుకుంటున్నారు. రషీద్ ఖాన్ అండగా ఉన్నా.. సమద్, అభిషేక్ బౌలింగ్లో ప్రభావం చూపలేకపోతున్నారు. దీని వల్లే వార్నర్ గత మ్యాచ్లో విలియమ్సన్తో బౌలింగ్ వేయించాడు. ఫాబియన్ అలెన్, నబీలో ఒకరికి చాన్సుంటుందేమో చూడాలి. పంజాబ్ విషయానికొస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్, పూరన్, మాక్స్వెల్తో లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ వైఫల్యమే వారి ప్రధాన సమస్య. 200 రన్స్కు పైగా టార్గెట్ను కూడా ఆ టీమ్ బౌలర్లు కాపాడలేకపోతున్నారు. దాని వల్లే ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓడిపోయారు. మహ్మద్ షమీ తప్ప వికెట్ టేకర్ లేడు. బౌలర్లు రాణించకపోతే పంజాబ్కు మళ్లీ నిరాశ తప్పదు.
For More News..