రెండోసారి నీటి వృథా.. కనెక్షన్ కట్

రెండోసారి నీటి వృథా.. కనెక్షన్ కట్
  • మొదటిసారి నోటీసు, రూ.10 వేల జరిమానా  
  • అదే తప్పు మళ్లీ చేయడంతో వాటర్​బోర్డ్ యాక్షన్​
  • మరెవరైనా ఇలా చేస్తే ఇట్లాంటి  చర్యే ఉంటుందన్న ఎండీ  

హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని రెండో సారి వృథా చేయడంతో ఏకంగా ఆ ఇంటి కనెక్షన్​నే కట్​చేసి పడేశారు వాటర్​బోర్డు అధికారులు. ఈ ఇంటి యజమాని గతంలో నీటిని వృథా చేయగా రూ.10 వేల ఫైన్​వేశారు. అదే తప్పును మళ్లీ చేయడంతో తీవ్ర చర్యలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 3 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో ఓ వ్యక్తి తాగునీటి సంపు నిండి ఓవర్ ఫ్లో అయి దాదాపు కిలో మీటర్ వరకు తాగునీరు వృథాగా పారింది. 

దీంతో ఓ అండ్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించి తాగునీటిని వృథా చేయవద్దని చెప్పి, నోటీసు ఇచ్చారు. ఎండీ  ఆదేశాల మేరకు రూ.10 వేల ఫైన్​వేశారు. మరో సారి ఇలా చేస్తే కనెక్షన్ తొలగిస్తామని అప్పుడే హెచ్చరించారు.  బుధవారం ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ మెయిన్​రోడ్డుపై వెళ్తుండగా రోడ్ నంబర్​12 లో నీరు లీకేజి అయినట్టు గమనించారు.

గతంలోనూ నిర్లక్ష్యంతో నీటిని వృథా చేసినందుకు  జరిమానా విధించారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో సారి నీటి వృథా చేస్తున్నందుకు కనెక్షన్ తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటి కనెక్షన్​ను కట్​చేశారు. తాగునీరు అతి విలువైనదని, ఎవరైనా నీటి వృథా చేస్తే ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు.