దుబాయ్ లో డ్రగ్స్ తో దొరికిన హైదరాబాద్ యువతి

దుబాయ్ లో  డ్రగ్స్ తో  దొరికిన  హైదరాబాద్ యువతి
  • న్యాయం చేయాలని  విదేశాంగ మంత్రికి  బాధితురాలి తల్లి లేఖ

ఎల్బీనగర్, వెలుగు: పొట్ట కూటి కోసమని ట్రావెల్ ఏజెంట్ ద్వారా దుబాయ్​కు వెళ్లిన హైదరాబాద్ యువతి చిక్కుల్లో పడింది. ఆమె వద్ద డ్రగ్స్​పట్టుబడడంతో దుబాయ్​పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. తన కుమార్తెకు ఏమీ తెలియదని, ట్రావెల్ ఏజెంటే ఆమెకు తెలియకుండా డ్రగ్స్​తో ఉన్న బ్యాగ్​ఇచ్చాడని విదేశాంగ మంత్రిని బాధితురాలి తల్లి ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. కిషన్ బాగ్​కు చెందిన అమీనా బేగం(24)కు యూఏఈ బ్యూటీ పార్లర్​లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ ఆమెను ఇదే ఏడాది మే18న దుబాయ్​కు పంపించాడు.

 అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ లో ఆమె బ్యాగ్ చెక్ చేయగా, అందులో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో ఆమెను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, తన బిడ్డను ట్రావెట్ ఏజెంట్ మోసం చేశాడని, ఆమెకు తెలియకుండా డ్రగ్స్ ఉన్న బ్యాగ్​ఇచ్చాడని అమీనా తల్లి సుల్తానా బేగం పేర్కొంది. 

తనకు కుమార్తెకు న్యాయం చేసి, విడిపించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​కు ఆదివారం లేఖ రాసింది. అలాగే అమీనా తన కుటుంబాన్ని జైలు నుంచి సంప్రదించి, తాను నిర్దోషినని చెప్పింది. కాగా, ఈ ఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అమీనాను దుబాయ్​కు పంపిన ఏజెంట్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటే అవకాశం ఉంది.