ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య
  •     భార్యను చంపి, పిల్లాడితో ఇండియా వచ్చిన భర్త
  •     అత్తామామలకు కొడుకును అప్పగించి, నిజం వెల్లడి
  •     విక్టోరియా రాష్ట్రంలో బయటపడ్డ మహిళ మృతదేహం

హైదరాబాద్, సిడ్నీ: ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ దారుణ హత్యకు గురైంది.. హంతకుడు మృతదేహాన్ని డస్ట్ బిన్ లో కుక్కి ఊరవతల పడేసి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు డస్ట్ బిన్ ను పరిశీలించగా.. అందులో మహిళ మృతదేహం బయటపడింది. ప్రాథమిక ఆధారాలతో మృతురాలిని చైతన్య మాధగానిగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. చైతన్య అలియాస్ శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ హత్య చేశాడని అనుమానిస్తున్నారు. మృతదేహం బయటపడే సమయానికి అశోక్ రాజ్​దేశం విడిచి వెళ్లాడని విక్టోరియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఇతరత్రా కోణాలలోనూ కేసును విచారిస్తున్నామని వివరించారు.

బక్లే శివార్లలో మృతదేహం..

హైదరాబాద్​కు చెందిన చైతన్య.. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రం బక్లేలో ఉంటోంది. ఈ దంపతులకు మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే, ఇటీవల తమ అల్లుడు సడెన్ గా ఇంటికొచ్చాడని, మనవడిని తమకు అప్పజెప్పాడని చైతన్య తల్లిదండ్రులు తెలిపారు. చైతన్యను ఆస్ట్రేలియాలోనే చంపేసినట్లు ఒప్పుకున్నాడని వివరించారు.  మనవడిని అప్పగించి వెళ్లిపోయాడని తెలిపారు. శనివారం తమ కూతురు మృతదేహాన్ని బక్లే ఊరవతల గుర్తించినట్లు ఆస్ట్రేలియా పోలీసులు సమాచారం అందించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లు చెప్పారు. ఈ విషయంలో సాయం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిశామన్నారు. దీనిపై కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే చెప్పారు. కాగా, చైతన్య తల్లిదండ్రులకు తన కొడుకును అప్పగించిన అశోక్ రాజ్.. తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే, చైతన్యను చంపడానికి కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు.