
- వ్యర్థాలు, కెమికల్స్తో నీరు కలుషితం
- ఆక్సిజన్ తగ్గడంతో చేపల మృత్యువాత
- సిటీలోని మిగతా చెరువుల్లోనూ ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రధాన టూరిజం స్పాట్ అయిన దుర్గం చెరువు కాలుష్య కోరల్లో చిక్కింది. ఒకప్పుడు మంచినీటిని అందించిన చెరువు ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయి కంపుకొడుతోంది. ఇందుకు ప్రధాన కారణం చెరువు చుట్టుపక్కల నిర్మించిన అపార్ట్ మెంట్లు, ఆస్పత్రుల నుంచి వ్యర్థాలు కలవడమేనని తెలుస్తోంది. దుర్గం చెరువు నీటిలో డ్రైనేజీ , కెమికల్స్తో పాటు, యూరిన్ మెటాబాలైట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఒబేసిటీ మెడిసిన్స్, కొకైన్లాంటి విష పదార్థాలు ఉన్నట్లు పలు పరిశోధల్లో వెల్లడైంది. దీంతో చెరువు నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు చనిపోతున్నాయి. ఇటీవల మార్నింగ్వాక్ వెళ్లిన వారికి దుర్గం చెరువులోని చేపలు చనిపోయి, మరికొన్ని తేలుతూ కనిపించాయి. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్అయింది. దుర్గం చెరువు మాత్రమే కాదు సిటీలోని ప్రధాన చెరువుల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. మల్కం చెరువు, ఖాజాగూడ చెరువు, చెంగిచెర్ల చింతల చెరువు తదితర చెరువుల్లో చేపలు, కప్పలు, ఇతర జలచరాలు అంతరించిపోతున్నాయి. దీనిపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటిని చెరువులోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కో ఆర్డినేషన్ లేకపోవడంతో..
వాటర్బోర్డు, జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడంతో మురుగునీరు చెరువులో చేరుతోంది. ఇన్ఆర్బిట్మాల్ నుంచి దుర్గం చెరువు వెళ్లే దారిలో ఫెన్సింగ్, సెక్యూరిటీ లేకపోవడంతో బయటి వ్యక్తులు చెత్త, ఇతర వ్యర్థాలను పడేస్తున్నారు. అయినా.. అధికారులు ఇన్లెట్నుంచి వచ్చే వ్యర్థాలను అడ్డుకోలేకపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
183 రకాల కాలుష్య కారకాలు
ఈ ఏడాది ఆగస్టులో మహీంద్రా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దుర్గం చెరువు నీటి నాణ్యతపై స్టడీ చేశారు. రకరకాల కెమికల్స్తో నీరు విషపూరితమై ఉన్నట్లు తేల్చారు. ఫార్మాస్యూటికల్స్, మెటాబాలైట్లు, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, హార్మోన్లు, స్టెరాయిడ్స్, యూవీఫిల్టర్స్, ప్లాస్టిసైజర్స్, సైనోటాక్సిన్లతో పాటు 183 రకాల మైక్రో పొల్యూటెంట్లను నీటిలో పరిశోధకులు గుర్తించారు. యూరిన్ మెటాబాలైట్స్, డిప్రెసెంట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ ఒబేసిటీ మెడిసిన్స్, కొకైన్–డీ3, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లాంటి పదార్థాలు ఉన్నట్లు స్టడీలో తేలింది. ప్రధానంగా 50 శాతం ఫార్మస్యూటికల్స్, 9 శాతం మెటాబోలైట్స్, 8 శాతం హెర్బిసైడ్స్ ను నీటిలో కలిసిపోయినట్టు పరిశోధకులు తెలిపారు.
ప్రభుత్వాలకు సరైన ప్లాన్ లేదు
ఏండ్ల నుంచి సిటీలోని చెరువుల్లో మురుగు నీరు చేరుతూనే ఉంది. అడ్డుకోవడానికి ప్రభుత్వాల వద్ద సరైన ప్లాన్ లేదు. డెవలప్ మెంట్ అంటే సిటీ విస్తరణే కాదు. సహజ వనరులను కూడా కాపాడుకోవాలి. ప్రధానంగా డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుస్తుంది. దీంతో నీటిలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి చేపలు, ఇతర జీవులు చనిపోతున్నాయి. చెరువుల్లోకి వచ్చే ఇన్లెట్ నీటిని శుద్ధి చేశాకే వదలాలి. ఇది విదేశాల్లో అనుసరించే పద్ధతి.
– బాబురావు, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
పైన మెరుగు.. కింద మురుగు
ఒకప్పుడు మంచినీటిని అందించిన దుర్గం చెరువు ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. డ్రై, లిక్విడ్ వేస్టేజ్ చెరువులో చేరుతుంది. అటువైపు వెళ్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పక్షులు కూడా ఉండలేని పరిస్థితి ఉంది. పై నుంచి చూస్తే కేబుల్బ్రిడ్జి అందగా కనిపిస్తుంది. చెరువు నిండా మురుగు నీరే. దీంతో పాటు ఖాజాగూడ, మల్కం చెరువుల్లోనూ ఇదే పరిస్థితి. అభివృద్ధి పేరుతో చెరువులను నాశనం చేశారు.
– లుబ్నా సార్వత్, ఫౌండర్, డైరెక్టర్, సెంటర్ ఫర్ వెల్ బీయింగ్ ఎకనామిక్స్, హైదరాబాద్
ఇది హ్యుమన్ రైట్స్ వయొలేషన్..
చెరువును కలుషితం చేయడం హ్యూమన్ రైట్స్వయొలేషన్ కిందకు వస్తుంది. సిటీలోని చెరువులకు డ్రైనేజీ నీరు, మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వచ్చే వ్యర్థాలే ఎక్కువ. అవి రాకుండా అడ్డుకోవడంలో జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి.
– వినయ్ వంగాల, సోషల్ యాక్టివిస్ట్