ఉప్పల్/ మల్కాజిగిరి/ సైదాబాద్, వెలుగు: నగరంలో అన్ని చెరువులను కబ్జాల నుంచి రక్షించి సుందరీకరణ పనులు చేపడుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. మంగళవారం ఆయన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభ్యర్థన మేరకు రామంతపూర్ చిన్న, పెద్ద చెరువులను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండు చెరువుల్లో మురుగు తొలగిస్తామని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాప్రా, నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ ఎంటీ నగర్ చెరువు, పటేల్ కుంట పూడికతీత పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే సైదాబాద్ ఎర్రకుంట చెరువును కూడా ఆయన పరిశీలించారు. ఇక్కడ ఆరు ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు.

