ఇప్పటివరకు సుమారు 1,350 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. స్వాధీనం చేసిన భూముల విలువ రూ. 70 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములను దశలవారీగా ప్రజా వినియోగానికి అందిస్తున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూములపై ఉన్న కోర్టు కేసులను చట్టపరంగా ఎదుర్కొని, కోర్టు క్లియరెన్స్ వచ్చిన తరువాతే ప్రజా వినియోగానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు.
కొండాపూర్ రాజేశ్వరి కాలనీలో కబ్జాదారుల నుంచి కాపాడిన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ విద్యా సంస్థలు, పార్కులు నిర్మించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు . ప్రభుత్వ భూములు, పార్కులు, ఓపెన్ స్పేస్ లను ఆక్రమణల నుంచి హైడ్రా కాపాడుతోంది. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పార్క్, విద్యా సంస్థల స్థాపనకే వినియోగిస్తామని చెప్పారు. విద్యా సంస్థలు, పార్క్ ల అభివృద్ధికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో సీఎంసీ కమిషనర్ సృజన, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి పరిశీలించారు.
