
- పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారుల నిర్ణయం
మేడిపల్లి, వెలుగు: చర్లపల్లి చెరువును మంచినీటి సరస్సుగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. చర్లపల్లి జైలు ప్రాంతంలో 58 ఎకరాల పరిధిలో ఉన్న ఈ చెరువును గురువారం వీరు సందర్శించారు. చెరువును ఆధునికీకరించడంతోపాటు సుందరంగా తీర్చిదిద్దడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు.
చెరువు చుట్టూ తిరిగి ఇన్లెట్, ఔట్లెట్లను పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో కొద్దిమొత్తం నీరు ఉన్నా పరిశుభ్రంగా ఉండడంతో జీవవైవిద్యానికి అవకాశం ఉందని, నిండా నీరుంటే మరింత ఆహ్లాదంగా మారుతుందన్నారు. ఈ క్రమంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్, కట్ట బలోపేతం, పాత్వే, సోలార్ లైటింగ్, సీసీటీవీలు ఏర్పాటుకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాన్ని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సీఎస్ఆర్ కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని, ఒక్కో సెగ్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో సమగ్ర నివేదిక ఇస్తే నిధులు అడగడానికి వీలుంటుందని సౌమ్య మిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు, డీఐజీలు శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఉన్నారు.