- కొండాపూర్లో 7 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కొండాపూర్లో 7 ఎకరాల భూములను హైడ్రా కాపాడింది. వీటి విలువ రూ. 1400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నంబర్ 78 నుంచి 93 పరిధిలో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 1993లో గ్రామపంచాయతీ లేఅవుట్ వేశారు. 2059 ప్లాట్లు ఏర్పాటు చేయగా.. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 5 ఎకరాలు కేటాయించారు. అలాగే, పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం, పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు.
స్కూల్ స్థలంలో 1000 గజాల మేర అపార్టుమెంట్ను నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2,181 గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వెంటనే కాపాడాలని హైడ్రా ప్రజావాణిన్ని కాలనీ సంక్షేమ సంఘం కోరింది. అవి ప్రజా అవసరం కోసం ఉపయోగపడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. లే ఔట్ ప్రకారం..పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ రాగా కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు షాపులు, షెడ్డులు వేసినట్టు గుర్తించారు. ఆ స్థలాలు అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలను తొలగించి శనివారం ఫెన్సింగ్ వేశారు. హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.
