హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను ఏర్పాటు చేసి 150 రోజులు పూర్తయిన సందర్భంగా మాన్సూన్ టీమ్ ను అభినందించారు కమీషనర్ రంగనాథ్. శుక్రవారం (నవంబర్ 28) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లో ఉత్తమంగా పనిచేసిన 30 మందికి అవార్డులు, శాలువాలతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్ రంగనాథ్.. వర్షం ఎంత పడ్డా హైడ్రా ఉందనే భరోసా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చామని అన్నారు. వర్షాకాలంలో క్యాచ్ పిట్స్, కల్వర్టులు, నాలాల పూడిక తొలగింపు 24 గంటలు చేపట్టారని ప్రశంసించారు.
మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేసి 150 రోజులు పూర్తయిన సందర్భంగా టీమ్స్ ను అభినందించారాయన. 3 వేల లారీలు పూడిక తొలగించి నగర వాసులకు వరద భయం లేకుండా ప్రయాణాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.
సమస్యను పరిష్కరించడం మాత్రమే కాదని.. సమస్యకు కారణాలు తెలుసుకుని ఎంఈటీలు పని చేశాయని కొనియాడారు. క్లౌడ్ బరస్ట్ ల సమయంలోనూ అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఈ అనుభవం ఉపయోగపడాలన్నారు.
అమీర్పేట, ప్యాట్నీ నాలాల్లో పూడిక తీయడం తో 25 కాలనీలు వరద ముప్పు నుంచి రక్షణ కల్పించామని అన్నారు. పండగరోజుల్లో కూడా సెలవులు లేకుండా సేవలందించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
