హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాలు ఉండగా, ఇందులో కొంతభాగం గతంలో విద్యుత్ సబ్స్టేషన్, జీహెచ్ఎంసీ చెత్త డంపు కోసం ప్రభుత్వం కేటాయించింది.
మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతోందని వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు ఫీల్డ్ స్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆలయం, మసీదు ఉన్న ప్రాంతాలను కాపాడుతూ భవిష్యత్తులో కబ్జాలు జరగకుండా బోర్డులు ఏర్పాటు చేశారు.
