- కొత్త చెరువు ఎఫ్టీఎల్లో ప్లే ఏరియా ఏర్పాటు చేసిన గోల్డ్ ఫిష్ విల్లా
- ఈదులకుంటలో 6.05 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు
- ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసిన హైడ్రా సిబ్బంది
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట విలేజ్లోని కొత్త చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొత్త చెరువు ఎఫ్టీఎల్ పరిధి 72 ఎకరాలు కాగా.. అభివృద్ధి పేరుతో చెరువు మధ్యలోంచి కట్టకట్టి ఎగువన ఉన్న 20 ఎకరాలకు పైగా భూమిని కొంతమంది రియల్టర్లు కబ్జా చేశారు.
ఫెన్సింగ్లు వేసి కొందరు, రేకుల ప్రహరీతో మరి కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. వీరి కబ్జాలకు చెరువు మధ్యలో నిర్మించిన కట్ట ఆసరాగా మారింది. మరోవైపు గోల్డ్ ఫిష్ విల్లాలను నిర్మించిన రియల్టర్ కబ్జాలకు పాల్పడ్డాడు. తన పరిధి వరకూ విల్లాలు నిర్మించి ఓపెన్ ఏరియాగా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి అందులో నిర్మాణాలు చేశారు.
చెరువులో మట్టి పోసి ఏకంగా బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను నిర్మించాడు. పిల్లల ప్లే ఏరియాను కూడా చెరువు పరిధిలోనే ఏర్పాటు చేశాడు. ఇలా 1.09 ఎకరాల మేర చెరువును ఆక్రమించేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా మంగళవారం తొలగించింది.
చెరువు హద్దులను నిర్ధారించి ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. అలాగే చెరువు ఎగువ భాగంలో కూడా 20 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించింది. భవిష్యత్తులో కబ్జాలకు అవకాశం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇలా రూ. 2,200 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.
ఈదులకుంటను కాపాడిన హైడ్రా..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబరు 7లో ఉన్న 6.05 ఎకరాల ఈదులకుంటను హైడ్రా కాపాడింది. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట నిండితే వరద కాలువ ద్వారా ఈదుల కుంటకు నీరు చేరేది. ఆ కాలువను డైవర్ట్ చేయడంతో ఈదుల కుంటకు వరద నీరు చేరకుండా చేశారు. చెరువు రూపురేఖలు మార్చేసి హద్దులు చెరిపేసి భవనాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. తమ్మిడికుంట, ఈదులకుంట,- సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వాటిలో ఈదుల కుంటని ఆక్రమిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు నమోదయింది.
స్థానికుల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రాకు అక్కడ చెరువు ఆనవాళ్లు కనిపించాయి. గ్రామ, రెవెన్యూ రికార్డుల మేరకు 6.05 ఎకరాల చెరువున్నట్టు నిర్ధారించుకుంది.
ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు కూడా నిర్ధారించాయి. కూకట్పల్లి మండలం పరిధిలోకి వచ్చే సర్వే నంబరు 1003 నుంచి 1006 వరకు ఉన్న భూమిని చూపించి 14 అంతస్తుల భవన నిర్మాణానికి ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంస్థ 2022లో అనుమతులు తీసుకుంది.
అయితే, నిర్మాణాలు మాత్రం 6.05 ఎకరాల ఈదులకుంటలో చేపడుతున్నారు. ఈ మేరకు సెల్లార్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే విషయమై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో విచారించారు. 6.05 ఎకరాల చెరువు స్థలంతో పాటు 5.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. దీంతో మంగళవారం చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేశారు.
6.05 ఎకరాల ఈదులకుంటకు తోడు ఆ పక్కనే సర్వే నంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎకరాల భూమిని కాపాడింది. ఇలా మొత్తం మాదాపూర్లో దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి చుట్టూ హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తున్నారు.
ఖైతలాపూర్లో 1,700 గజాల్లో కూల్చివేతలు..
కూకట్పల్లి మండలం ఖైతలాపూర్లోని జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు దాదాపు 1,700 చదరపు గజాల రహదారి ఆక్రమణకు గురైంది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీని డెవలప్ చేసిన సంస్థనే ఈ ఆక్రమణలకు పాల్పడింది.
ఈ స్థలంలో సంస్థ ఆఫీసు రూమ్, పశువుల కోసం షెడ్డును నిర్మిస్తున్నది. ఈ ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం హైడ్రా అధికారులు వాటిని తొలగించారు. ఈ భూమి విలువ దాదాపు రూ.25 కోట్ల వరకు ఉంటుంది.
