బండి సంజయ్ ని ఎదుర్కొనేందుకు నేను చాలు

బండి సంజయ్ ని ఎదుర్కొనేందుకు నేను చాలు
  • మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

సికింద్రాబాద్: ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు.. నేను, నా అనుచరులు చాలు.. ఎక్కడికి రావాలో చెప్పు.. అక్కడికే వస్తా.. కేవలం మల్కాజిగిరి లోనే క్యాడర్ ఉందనుకోకు.. రాష్ట్రమంతా మైనంపల్లి క్యాడర్ ఉంది..’’ అంటూ  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మల్కాజిగిరి జీహెచ్ఎంసి ఆఫీసులో ఏర్పాటు చేసిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి వర్గీయుల దాడిలో బీజేపి కార్పోరేటర్ గాయపడిన విషయం తెలిసిందే. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపధ్యంలో ఇరువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ ను పరామర్శించిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లను తెలుసుకున్న మైనంపల్లి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
బండి, గుండు, బద్మాష్ అంటూ బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు. బండి సంజయ్ చేసిన కామెంట్లు చూసి నా అనుచరులు ఆందోళనలు చేయడానికి సిద్ధపడ్డారు, నేనే వద్దని చెప్పి వారించి మీడియా సమాశం నిర్వహించడం జరిగిందన్నారు. తాను ఇంతవరకు బండి సంజయ్ ను నేరుగా కలవలేదు..  నేరుగా కనీసం చూడలేదన్నారు. అలాంటిది తాను నేను బీజేపీలో చేరతానని బండి సంజయ్ ను కలిసినట్లు రుజువు చేస్తే పార్టీని వదిలేస్తానని సవాల్ చేశారు. అభివృద్ధి చేద్దామని ప్రజల్లో తిరుతుంటే బీజేపీ నాయకులు అనవసరంగా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోసారి బండి సంజయ్ ఎంపీ ఎలా అవుతాడో నేనూ చేస్తా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఎంపి కానివ్వనని ఆయన పేర్కొన్నారు.