కాశ్మీరీలు హ్యాండ్​ గ్రెనేడ్స్ కాదు ప్రేమను ఇచ్చారు : రాహుల్

కాశ్మీరీలు హ్యాండ్​ గ్రెనేడ్స్ కాదు ప్రేమను ఇచ్చారు : రాహుల్

శ్రీనగర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్​ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న లౌకికవాదాన్ని రక్షించడమే లక్ష్యంగా భారత్​ జోడో యాత్ర  చేశానని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. ఈ యాత్రను తన కోసమో, కాంగ్రెస్​ పార్టీ కోసమో చేయలేదని.. దేశ ప్రజల కోసమే చేశానని స్పష్టంచేశారు. మన దేశానికి పునాదుల్లాంటి మౌలిక భావనలను నాశనం చేయాలనుకునే ఐడియాలజీకి వ్యతిరేకంగా నిలబడాలనేదే తన లక్ష్యమన్నారు. రాహుల్​ గాంధీ ఐదు నెలల క్రితం ప్రారంభించిన భారత్​ జోడోయాత్ర సోమవారం కాశ్మీర్​లోని శ్రీనగర్​ లో  ముగిసింది. ఈ సందర్భంగా నగరంలోని షేర్​ఎ కాశ్మీర్​ స్టేడియంలో ముగింపు సభ నిర్వహించారు. ఎముకలు కొరికే చలి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు నడుమ నిలబడి రాహుల్​ గాంధీ ప్రసంగించారు.  “నేను కాశ్మీర్​ లో యాత్ర చేస్తే దాడి జరిగే ముప్పు ఉందని కొందరు హెచ్చరించారు. అయినా నేను నా సొంతగడ్డ  కాశ్మీర్​ లో, నా వాళ్ల(కాశ్మీరీల) తో కలిసి యాత్ర చేసి తీరాలని నిర్ణయించుకున్నా. నా తెల్ల చొక్కా రంగును ఎరుపుమయం చేసే అవకాశాన్ని శత్రువులకు ఇవ్వాలని డిసైడ్​ అయ్యా. కాశ్మీర్​ ప్రజలు నాకు హ్యాండ్​ గ్రనేడ్స్​ ఇవ్వలేదు. మనసారా ప్రేమను పంచారు’’  అని రాహుల్ గాంధీ  ​చెప్పారు.  

ఆ ఫోన్​ కాల్స్​ను ఇంకా మర్చిపోలేదు

‘‘నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోయినపుడు ఫోన్​ లో సమాచారం అందింది.. అలాగే నాన్న (రాజీవ్​ గాంధీ) హత్యకు గురయ్యారని తెలిసింది కూడా ఫోన్​ ద్వారానే.. ఆ రెండు ఫోన్​  కాల్స్​ను నేను ఇంకా మర్చిపోలేదు. ఆ క్షణంలో మేం పడిన బాధను మాటల్లో చెప్పలేను. ఆ దారుణానికి పాల్పడిన వాళ్లు మా బాధ అర్థం చేసుకోలేరు” అని రాహుల్​ చెప్పారు. ‘మోడీ, అమిత్​ షా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్​ లాంటి హింసను ప్రేరేపించే వాళ్లకు మాలాంటి వాళ్ల బాధ అర్ధం కాదు. సైనికుల కుటుంబాలు,  పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్​ సిబ్బంది కుటుంబాలు అర్ధం చేసుకోగలవు.  అటువంటి ఫోన్​ కాల్​ వస్తే ఎలాంటి బాధ కలుగుతుందో కాశ్మీరీలు కూడా అర్థం చేసుకోగలరు” అని ఆయన కామెంట్​ చేశారు. ‘ఇలాంటి మరణవార్తలను చేరవేసే ఫోన్​ కాల్స్​ను ఆపేయాలనే సంకల్పంతోనే భారత జోడో యాత్ర చేశాను. బీజేపీకి ధైర్యముంటే ఇలాంటి యాత్రను కాశ్మీర్​ లో చేయాలి. భయంతో వణికిపోతున్న బీజేపీ నాయకులకు యాత్ర చేసే ధైర్యం లేదు’ అని రాహుల్ కామెంట్​ చేశారు. అంతకుముందు శ్రీనగర్​ లోని భారత్​ జోడోయాత్ర క్యాంప్​ సైట్​లో మువ్వన్నెల జాతీయ జెండాను రాహుల్​ గాంధీ ఆవిష్కరించారు. అనంతరం రాహుల్​ గాంధీని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

పలు పార్టీల గైర్హాజరు.. 

స్థానికులు, కాంగ్రెస్​ శ్రేణులు పెద్దగా రాకపోవడంతో  భారత్​ జోడో యాత్ర ముగింపు సభ కోసం వేసిన  కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. తీవ్రమైన చలి కారణంగా కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ మీటింగ్​ కు హాజరుకాలేదు. తృణమూల్​ కాంగ్రెస్​ సహా ఇంకొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు అయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే డీఎంకే, జేఎంఎం, బీఎస్పీ, నేషనల్​ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీ, ఐయూఎంఎల్, వీసీకే పార్టీల​ నేతలు పాల్గొన్నారు.