రాముడు మాంసాహారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జితేంద్ర అవద్ శ్రీరాముడు శాఖహారి కాదని మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.
#WATCH | On his "non-vegetarian" comment on Lord Ram, NCP-Sharad Pawar faction leader Jitendra Awhad says, "I express regret. I did not want to hurt anyone's sentiments." pic.twitter.com/wFIAXQXAKb
— ANI (@ANI) January 4, 2024
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముందు జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలతో పాటుగా హిందువులు ఆయనపై మండిపడుతున్నారు. హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసిన తేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సీఎం దీనిపై స్పందించాలన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు, రాముడు తన వనవాస సమయంలో ఫలాలు తినేవాడని చెప్పారు. రాముడిని అవమానించేలా కించపరిచే విధంగా జితేంద్ర అవద్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.