అవసరమైతే ప్రత్యేక పదవిని వదిలేస్తా : మల్లు రవి

అవసరమైతే ప్రత్యేక పదవిని వదిలేస్తా : మల్లు రవి
  •  ఎంపీగా మాత్రం పోటీ చేస్తా 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయినంత మాత్రాన ఎంపీగా పోటీ చేయొద్దని ఎక్కడా లేదని మల్లు రవి అన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడానికి పదవి అడ్డు అనుకుంటే వదిలేసుకుంటానని చెప్పారు. వైఎస్​ హయాంలోనూ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా పోటీ చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పోటీ చేస్తానని సీఎం రేవంత్​కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బుధవారం ఆయన పీసీసీ జనరల్​ సెక్రటరీ చరణ్​ కౌశిక్​ యాదవ్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

ఏపీకి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విజయసాయి రెడ్డి ఎంపీగా కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధితో పాటు ఎంపీగా కూడా ఉంటే కేంద్ర మంత్రులు, కేబినెట్​ సెక్రటరీలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను రాబట్టుకునేందుకు సులువు అవుతుందన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఈ నెల 28న ఢిల్లీలోని తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ సమక్షంలో చార్జ్​ తీసుకుంటానని తెలిపారు.

వైఎస్​ హయాంలో ఇరిగేషన్​ ప్రాజెక్టులకు క్లియరెన్సులపై కీలకంగా పనిచేశానని, ఇప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల క్లియరెన్సులను త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. శబరి హౌస్​ పక్కన మూడున్నర గుంటలు, పటౌడి హౌస్​ పక్కన ఐదున్నర ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుందని, ఆ ఫైళ్లు ప్రస్తుతం కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. వాటిని క్లియర్​ చేస్తే పటౌడి హౌస్​ పక్కన స్థలంలో తెలంగాణ భవన్​ను కట్టేందుకు వీలవుతుందని చెప్పారు.