
- కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో రెండో రోజు సోదాలు
హైదరాబాద్, వెలుగు: మహేశ్వరం కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లో శుక్రవారం కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. నార్సింగిలోని కేఎల్ఆర్ ఇల్లు. మాదాపూర్లోని కేఎల్ఆర్ సంస్థ ఆఫీసులో సోదాలు చేశారు. కేఎల్ఆర్, బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డిలకు చెందిన ఇండ్లు, ఆఫీసుల్లో గురువారం మొదలైన ఐటీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి.
బాలాపూర్లోని పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. సోదాలు ముగిసిన అనంతరం మేయర్ పారిజాత, నర్సింహా రెడ్డిలకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పాన్కార్డు, ఆధార్కార్డు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.