న్యూఢిల్లీ: భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్న అవామీ లీగ్ చీఫ్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాను ఈ ఏడాదే స్వదేశానికి తిరిగి వెళ్తానని తెలిపారు. అవామీ లీగ్పై బ్యాన్, మరణశిక్ష విధించడం వంటి అంశాలు తనను ఆపలేవని ఆమె చెప్పారు. అవామీ లీగ్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అదొక తిరుగులేని శక్తి అని అభివర్ణించారు. దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై జరుగుతున్న అటాక్స్గా అభివర్ణించారు.
ఈ మేరకు ఆదివారం మీడియాకు షేక్ హసీనా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను స్వదేశానికి వెళ్లాలని అనుకోవడం వ్యక్తిగత ప్రతిష్ట లేదా అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. ఇది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, చట్టబద్ధమైన పాలన, విముక్తి పోరాట స్ఫూర్తితో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.
