
టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీని ఫ్యాన్స్ ముద్దుగా ‘కింగ్ కోహ్లీ’ అని పిలుస్తారు. నాయకుడిగా, బ్యాట్స్మన్గా తిరుగేలేదన్నట్టుగా దూసుకెళ్తున్న విరాట్ అనేక రికార్డులు బద్దలు కొడుతున్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ప్లేస్లో ఉన్న కోహ్లీ టార్గెట్ ఇప్పుడు ఇండియాకు వరల్డ్కప్ అందించడమే. ఇండియా ఫ్యాన్సే కాకుండా ఐసీసీ కూడా కోహ్లీ కప్పు నెగ్గాలని కోరుకుంటున్నట్టుంది. అందుకే మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ ప్రత్యేక పెయింటింగ్ను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెత్తిన కిరీటం.. మెడలో వజ్రాల హారం… ఒక చేతిలో బ్యాటు, మరో చేతిలో బంతితో సుల్తాన్ వేషధారణలో సింహాసనంపై ఓ మహారాజులా విరాట్ కూర్చున్నాడు. ఒకవైపు ఇండియా వరల్డ్కప్లు నెగ్గిన సంవత్సరాలు.. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో చాంపియన్ విరాట్ అని రాసి ఉంది. దీన్ని చూసి కోహ్లీ అభిమానులు కొందరు సంబరపడిపోతే.. మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విరాట్ ముఖం లోకేశ్ రాహుల్లా ఉందని ట్రోల్ చేశారు. వరల్డ్కప్లో ఇండియా ఒక్కటే ఆడడం లేదని, ఐసీసీ పక్షపాతం చూపిస్తోందని ఇతర దేశాల ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.