వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ టోర్నీ షెడ్యూల్ విడుదల..

వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ టోర్నీ షెడ్యూల్ విడుదల..

పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ 2023 క్వాలిఫయర్ మ్యాచుల షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జూన్‌ 18 నుంచి జులై 9 వరకు ఈ టోర్నీ జరుగనుంది. క్వాలిఫయర్ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననుండగా, రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 సూపర్-10కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌-ఏలో జింబాబ్వే, వెస్టిండీస్‌, నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఉండగా, గ్రూప్‌-బిలో శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు ఉన్నాయి.

గ్రూప్ స్టేజులో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ క్రమంలో రెండు గ్రూప్‌ల్లో టాప్‌- 3 స్థానాల్లో నిలిచిన 6 జట్లు సూపర్ సిక్స్‌ కు అర్హత సాధిస్తాయి. అనంతరం సూపర్ సిక్స్‌ స్టేజులో ప్రతి జట్టు కూడా గ్రూప్‌ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. అంటే.. గ్రూప్ -ఏలోని జట్లు గ్రూప్ -బిలోని జట్లతో తలపడతాయన్నమాట. ఈ మ్యాచ్‌లు అయిపోయే సరికి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్-2023కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి జట్టు సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లను మినహాయిస్తే, గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ అవుతాయి. 

కాగా, భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిన రెండు జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధిస్తాయి. ఇక ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేసేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే టోర్నీ అక్టోబర్ 5న ఆరంభమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.