
సింగపూర్: ఇంటర్నేషల్ క్రికెట్లో కీలక మార్పులు రాబోతున్నాయా..? టెస్టు క్రికెట్ను రెండంచెలుగా మారుస్తారా..? టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల సంఖ్య 24కు చేరుకుంటుందా..? ఈ ప్రశ్నలకు మరో నాలుగు రోజుల్లో సమాధానం రానుంది. గురువారం నుంచి జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వీటిపై కీలక చర్చ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఏజీఎంలో సభ్యులు క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలపై చర్చి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రధానంగా టెస్ట్ క్రికెట్ను రెండు విభాగాలుగా విభజించే ప్రతిపాదన, టీ20 వరల్డ్ కప్లో జట్ల సంఖ్యను పెంచడం, కొత్త సభ్య దేశాలను చేర్చుకోవడం వంటి విషయాలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా రెండంచెల టెస్ట్ ఫార్మాట్ (టు టైర్ సిస్టమ్) అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) మద్దతు ఇస్తున్న ప్రతిపాదనపై ఐసీసీ మెంబర్స్ ప్రధానంగా చర్చించే చాన్సుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం టెస్ట్ ఆడే దేశాలను రెండు వేర్వేరు విభాగాలుగా విభజిస్తారు. పెర్ఫామెన్స్ ఆధారంగా టీమ్స్ ప్రమోషన్, రిలెగేషన్ చేసి నిధుల కేటాయింపులపై ఐసీసీ ఏజీఎంలో నిబంధనలు రూపొందించే చాన్సుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-–27 సైకిల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో ఈ కొత్త విధానానికి అమోదముద్ర పడితే 2027 తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
24 జట్లతో టీ20 వరల్డ్ కప్..?
వన్డే వరల్డ్ కప్లో జట్లను పెంచే ఆలోచన ఐసీసీకి లేనప్పటికీ టీ20 కప్లో మాత్రం మరిన్ని జట్లను చేర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుత 20 టీమ్స్ ఉండగా మరో నాలుగింటిని చేర్చి 24 జట్లతో ఈ టోర్నీ నిర్వహించే ప్రణాళికలున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ తిరిగి చేరడం.. వచ్చే ఏడాది ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్కు ఇటలీ అర్హత సాధించడం ఈ విస్తరణ ఆలోచనలకు మరింత బలాన్నిచ్చింది.
ఇటలీ అర్హతతో క్రికెట్ కొత్త దేశాల్లో కూడా ఆదరణ పొందుతోందని, మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలని ఐసీసీ కోరుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఐసీసీ చైర్మన్ జై షా, కొత్త సీఈవో సంజోగ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగే ఈ ఏజీఎంలో పాలన, నిధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపైనా చర్చించనున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై వచ్చిన అధిక ఖర్చుల ఆరోపణలపై విచారణకు సంబంధించిన తుది నివేదికను ఐసీసీ పరిశీలించే అవకాశం ఉంది. ఇక, 2019లో నిషేధానికి గురైన జాంబియా ఐసీసీలో అసోసియేట్ మెంబర్గా తిరిగి చేరనుంది. ఈస్ట్ తిమోర్ తొలిసారిగా ఐసీసీలో సభ్యత్వం పొందే అవకాశం ఉంది.