
- నవంబర్లో పనులు ప్రారంభం.. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్
- తాత్కాలిక ఏర్పాటుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ భవనాల పరిశీలన
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: నవంబర్ చివరి నాటికి టీ స్క్వేర్ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా టీ స్క్వేర్ భవనాన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్లా తీర్చిదిద్దాలని సూచించారు. శనివారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీం రేవంత్ మాట్లాడుతూ.. టీ స్క్వేర్ 24 గంటల పాటు పనిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అందులో ఆపిల్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, వినియోగదారుల సౌలభ్యం కోసం యుటిలిటీ జోన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు ఏఐ హబ్ ఏర్పాటు, దాని కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి
గైడ్ చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఏఐ సంస్థల ప్రతినిధులతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. తాత్కాలికంగా ఏఐ హబ్ను ప్రారంభించేందుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో అనువైన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.