రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్
న్యూఢిల్లీ, వెలుగు: గిరిజన కుంభమేళగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరని చెప్పారు. సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున గిరిజనులు వస్తారని తెలిపారు.
సంప్రదాయబద్ధంగా సాగే మేడారం జాతర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. ఆర్థిక మాంద్యం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం జాతరకు భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు.