
ఓ వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ధనుష్. గత ఏడాది ‘రాయన్, రీసెంట్గా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలను డైరెక్ట్ చేసిన ధనుష్.. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఆదివారం మొదటి పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సాంగ్ కంపోజ్ చేయగా, ‘ఎంత ఆనందం.. ఎంత ఆనందం.. చీకటిలో వెలుగులా వచ్చావే.. నువ్వే నా ప్రాణం’ అంటూ ధనుష్ స్వయంగా లిరిక్స్ రాయడంతో పాటు శ్వేతా మోహన్తో కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది.
ఇందులో ధనుష్, నిత్యా మీనన్ భార్యాభర్తలుగా కనిపిస్తూ, ఇంప్రెస్ చేశారు. కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో పాటను చిత్రీకరించడం ఫ్రెష్ ఫీల్ను కలిగిస్తుంది. ధనుష్కి నటుడిగా ఇది 52వ సినిమా కాగా, దర్శకుడిగా నాలుగో సినిమా. రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 1న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది.