
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్తో తెలుగులో చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తన తండ్రిని ఒప్పిస్తూ ‘ఇడ్లీ గ్రైండర్ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది’ అని ధనుష్ చెప్పే సీన్తో మొదలైన ట్రైలర్ హార్ట్ టచ్చింగ్గా సాగింది.
మురళి పాత్రలో మధ్య తరగతి వ్యక్తిగా ధనుష్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టు మీద మురళికి చాలా అనుబంధం ఉంటుంది. ఆ ఇడ్లీ బండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ చాలా సెంటిమెంట్. అదే సమయంలో మురళి హోటల్ మేనేజ్మెంట్లోకి వెళ్లి, అరుణ్ విజయ్ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు.
వ్యాపారం లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తు మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది. ధనుష్, నిత్యా మీనన్ మధ్య కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. శాలిని పాండే, సత్యరాజ్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. అక్టోబర్ 1న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.