ఆర్మీలో చేరాలని ఉంది: కల్నల్ అశుతోష్ వైఫ్​

ఆర్మీలో చేరాలని ఉంది: కల్నల్ అశుతోష్ వైఫ్​

జైపూర్: ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉందని హంద్వారా ఉగ్ర దాడిలో మృతి చెందిన కల్నల్ అశుతోష్ శర్మ భార్య పల్లవి శర్మ తెలిపారు. ‘నేను ఇండియా ఆర్మీలో చేరాలని భావిస్తున్నా. కానీ వయస్సు రీత్యా కుదరదని తెలుసు. ఒకవేళ మంత్రిత్వ శాఖ అనుమతిస్తే మాత్రం ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలని అనుకుంటున్నా. గత రెండ్రోజులుగా చుట్టూ జరుగుతున్న విషయాలను చూస్తున్న నా కూతురు కూడా ఆర్మీలో చేరాలని అనుకుంటోంది. అయితే ఒక మంచి మనిషిగా, బాధ్యత కలిగిన పౌరురాలిగా తనను తీర్చిదిద్దడం చాలా ముఖ్యం’ అని పల్లవి చెప్పారు.

హంద్వారాలో మిలిటెంట్లతో జరిగిన పోరాటంలో కల్నల్ అశుతోష్ అసువులు బాశారు. చంగిములాలోని ఓ ఇంట్లో కొందరు ప్రజలను మిలిటెంట్లు బందీగా ఉంచారు. వారిని కాపాడే క్రమంలో మిలిటెంట్ల దాడిలో ఆయన మరణించారు. అశుతోష్ శర్మ, పల్లవికి 11 ఏళ్ల ఓ కూతురు ఉంది. అశుతోష్ సొంతూరు ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ అయినప్పటికీ ఫ్యామిలీ జైపూర్ లోనే ఉంటోంది. మంగళవారం జరిగిన అశుతోష్ అంత్యక్రియలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేబినెట్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ హాజరయ్యారు.