
రోడ్డు లేక తాటిపాముల తండా వాసుల తిప్పలు
పెబ్బేరు,వెలుగు: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేస్తున్నామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కనీసం రోడ్లు లేక తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని కుంటివాని తండా (తాటిపాముల తండా)కు ఉన్న మట్టి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. దీంతో ఎవరికైనా పానం బాగలేకపోతే కిలో మీటర్ దూరం మంచంపై మోసుకెళ్లాల్సి వస్తోంది. సోమవారం ఓ వృద్ధుడికి సుస్తి చేస్తే మంచంపై పడుకోబెట్టి ఇలా మోసుకెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీరంగాపూర్ జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ యాదవ్ తండాను సందర్శించారు. రోడ్డుతో పాటు నీళ్లు, కరెంట్ కూడా ఉండడం లేదని తండా వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.