ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదు

ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు టీడీపీ నేతలు చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టడంతో  పోలీసులు వారిని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ లు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రశాంతంగా జరిగే ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం గర్హనీయమన్నారు బాబు. బాధితులకు న్యాయం చేయకుండా, న్యాయం చేయమని అడిగేవారిని అణిచేయడం దారుణమన్నారు.ఇంత పెద్దఎత్తున హౌస్ అరెస్ట్ లు  చరిత్రలో లేవని, ఇంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తనను సైతం గృహ నిర్బంధం చేయటం అత్యంత దారుణమైన విషయమని,ఇలా ఎన్నిరోజులు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

నివసించే హక్కు, ఆస్తులు కాపాడుకునే హక్కు అందరికీ ఉందని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ విఫలం అయ్యింది కాబట్టే ప్రశ్నించడానికి తాము ముందుకొచ్చామన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు.

వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని అందరూ గర్హించాలి. ప్రజా సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు చంద్రబాబు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదని, బాధిత 125 కుటుంబాల వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈరోజు కాకపోతే, రేపు, లేదా ఎల్లుండు ఎప్పుడైనా సరే ఆత్మకూరు వెళ్లి తీరుతామని, ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు.

I'll continue 'Çhalo Atmakur' says TDP Chief Chandrababu naidu