- బోయినిపల్లి పీఎస్లో రిటైర్డ్ సీఐ భూమయ్య ఫిర్యాదు
బోయినిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టులో భాగంగా ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని సంతోష్ అక్రమ పట్టాతో పొందారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అత్తగారి ఊరు కొదురుపాక ముంపునకు గురైందని తెలిపారు.
దీంతో ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించిందని, అందులో సంతోష్ బీపీఎల్ కోటా కింద అక్రమంగా పట్టాప్యాకేజీ పొందారని ఆరోపించారు. ఆయనతో పాటు 25 ఏండ్ల కింద పెండ్లైన అతని చెల్లె సౌమ్య, సిరిసిల్ల మండలం పెద్దూర్కు చెందిన అతని బాబాయ్ గండ్ర రమణారావు కూడా అక్రమంగా ప్యాకేజీ పొందారని దాసరి భూమయ్య ఆరోపించారు.