కేసీఆర్ కోసం 48గంటల్లో 30 లక్షలతో సెక్రటేరియట్

కేసీఆర్ కోసం 48గంటల్లో 30 లక్షలతో సెక్రటేరియట్

వరంగల్‌లో కొత్త సచివాలయం ప్రారంభమైంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయకరావు కొత్త సెక్రటేరియట్ను ప్రారంభించారు. అదేంటి కొత్త సెక్రటేరియట్ హైదరాబాద్లో కదా నిర్మించారు. వరంగల్లో ఎలా ప్రారంభిస్తారు...అన్న అనుమానం వచ్చిందా..?  మీరు చదివింది నిజమే. వరంగల్లోనూ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కానీ ఇది నిజమైన సెక్రటేరియట్ కాదు. సచివాలయ నమూనా మాత్రమే. 

సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని వరంగల్లో 3 రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక అజంజాహి మైదానంలో  రూ. 30 లక్షల ఖర్చుతో  వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  కొత్త సెక్రటేరియట్ నమునాను ఏర్పాటు చేశారు. ఈ సెట్టింగ్ వరంగల్ తూర్పు నియోజవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నూతన సచివాలయ సెట్టింగ్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సచివాలయ సెట్టింగ్లో రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ఫోటోలను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ  సాధనలో కేసీఆర్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, రాష్ట్రాన్ని సాధించిన తీరును వివరిస్తూ ఫోటోలను సెక్రటేరియట్ సెట్టింగ్లో  ప్రదర్శనకు పెట్టినట్లు చెప్పారు. మొత్తం 48 గంటల పాటు కష్టపడి సెక్రటేరియట్ సెట్టింగ్ ను నిర్మించామని అన్నారు.