మీ ఆస్తుల లెక్క చెప్పండి..పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి

మీ ఆస్తుల లెక్క చెప్పండి..పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి

ఇస్లామాబాద్‌‌‌‌:  ఈనెల 30లోగా తమ ఆస్తుల వివరాలను  ప్రకటించాలని పాకిస్తాన్‌‌‌‌ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌  ప్రజల్ని కోరారు.  టాక్స్‌‌‌‌ ఆమ్నెస్టీ స్కీమ్‌‌‌‌  బెనిఫిట్స్‌‌‌‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  ఆర్థికంగా  తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న  దేశాన్ని ప్రగతి దారుల్లో నడిపించడానికి సహకరించాలని ప్రజల్ని  ప్రధాని కోరారు.  2019-–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరల్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌ను మంగళవారం  ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ సోమవారం  ప్రజలకు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ‘‘ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తుల ప్రకటన స్కీమ్‌‌‌‌లో  మీరూ భాగంపంచుకోవాలని కోరుతున్నా.  మీరు టాక్స్‌‌‌‌లు కట్టకపోతే , దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వీలుపడదు’’ అని ఖాన్‌‌‌‌ అన్నారు. పదేళ్ల క్రితం దేశానికి ఆరు వేల బిలియన్ల అప్పు ఉంటే ఇప్పుడది 30 వేల బిలయన్ల రూపాయలకు చేరుకుందని  ఇమ్రాన్‌‌‌‌  చెప్పారు.  ఏటా టాక్స్‌‌‌‌ రూపంలో వస్తున్న నాలుగు వేల బిలియన్‌‌‌‌ రూపాయల్లో సగం డబ్బు తీసుకున్న లోన్లు తిరిగి చెల్లించడానికే సరిపోతోందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ టాక్స్‌‌‌‌ ఉన్న దేశం పాకిస్తాన్‌‌‌‌ అని  చెప్పారు.

బినామీ ఆస్తులు, బినామీ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లు, ఇతర దేశాల్లో డబ్బు దాచుకున్నవాళ్లు  వాలంటీర్‌‌‌‌గా తమ ఆస్తుల్ని ప్రకటించాలని  ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ సర్కార్‌‌‌‌ ఈ ఏడాది మేలో   కోరింది.  స్వచ్చందంగా ఆస్తుల్ని ప్రకటించేవారి కోసం టాక్స్‌‌‌‌ ఆమ్నెస్టీ స్కీమ్‌‌‌‌ను  ఎనౌన్స్‌‌‌‌ చేసింది. దీని కోసం ప్రెసిడెన్షియల్‌‌‌‌ ఆర్డినెన్స్‌‌‌‌ను తీసుకొచ్చింది.  బినామీ ఆస్తులు, వాటి అమ్మకాలు,కొనుగోళ్లకు సంబంధించిన  వివరాలను ప్రకటించడానికి 45 రోజుల గడువును ఇచ్చింది.