
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటించే అవకాశం
జిల్లాలకు మళ్లీ ఇన్చార్జ్ మంత్రులను నియమించనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత వారి జాబితా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలోనే జిల్లా మినరల్ ఫండ్స్ ఖర్చు పెట్టనున్నారు. మైనింగ్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కోసం మైన్స్, మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంటుంది. వీటిని జిల్లా మినరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. గతంలో కలెక్టర్ నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించి ఏ పనులకు నిధులివ్వాలో నిర్ణయించేవారు. కానీ, గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషన్ నిర్మాణాన్ని మార్చేసింది. నిధుల కేటాయింపు అధికారాలను ప్రజాప్రతినిధులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి చైర్మన్ గా కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ రూల్స్ మార్చింది. ఈ కమిటీ సూచనల మేరకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది. కానీ ఈ లోపు అసెంబ్లీ రద్దవడం, తర్వాత వరుస ఎన్నికలతో ఇన్చార్జ్ మంత్రుల నియామకం కుదురలేదు.
ఒక్కొక్కరికి మూడు జిల్లాలు!
రాష్ట్రానికి జిల్లా మినరల్ ఫండ్స్ (డీఎంఎఫ్) కింద రూ.1,800 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధులు ఇన్చార్జ్ మంత్రులు లేక మురిగిపోతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులున్నారు. ఇన్చార్జ్ మంత్రుల నియామకం జరిగేలోపు మంత్రి వర్గ విస్తరణ లేకపోతే 11 మంది మంత్రులకు ఒక్కొక్కరికి 3 జిల్లాల బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఉండేవారు. తెలంగాణ వచ్చాక ఇన్చార్జ్ మంత్రుల వ్యవస్థను కేసీఆర్ రద్దు చేశారు. కానీ డీఎంఎఫ్ నిధుల కోసం నిబంధనలు మార్చడంతో తిరిగి ఇన్చార్జ్ మంత్రులను ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని బాధ్యతలు?
ఇన్చార్జ్ మంత్రులను నియమిస్తే వారికి రాజకీయ ప్రాధాన్యం పెరగనుంది. జిల్లాల్లో వందలాది నామినేటెడ్ పోస్టులున్నాయి. వారి నియామకంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కీలకంగా మారొచ్చని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. జిల్లా స్థాయిలో నేతల సమన్వయం, సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించే బాధ్యతలను కూడా వారికి అప్పగించే అవకాశం ఉంది.